ఏడుపాయల ఆలయ ఈవో,ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్
ఈ నెల 25 వరకు ఆలయం మూసివేత
అమ్మవారి ఆర్జిత సేవలు యథాతథం
పాపన్నపేట, మార్చి 19: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ ఈవోతోపాటు మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈవో రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్ వెళ్లి పరీక్షలు నిర్వహించుకోగా, కరోనా పాజిటివ్గా గురువారం రాత్రి నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారం నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం రద్దుచేశారు. దీంతో ఏడుపాయల ఆలయాన్ని ఈనెల 25వరకు మూసివేస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. అమ్మవారి ఆలయాన్ని మాత్రం వేకువజామునే తెరిచి అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి మూసివేయనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. విషయం తెలియక శుక్రవారం ఏడుపాయలకు వచ్చిన భక్తులు అమ్మవారిని ఆలయ ప్రాంగణం నుంచి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుని వెనుదిరిగారు. ఇటీవల నిర్వహించిన జాతరకు ఆలయానికి లక్షలాది మంది భక్తులు వచ్చారు. వారి నుంచి ఆలయ ఈవోకు కరోనా సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం పొడ్చన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వనదుర్గమ్మ ఆలయానికి చేరుకుని తాత్కాలిక, పర్మినెంట్ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 72మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారించారు. ఒకరు విద్యుత్ శాఖ సిబ్బంది, మరొకరు పారిశుద్ధ్య సిబ్బందిగా అధికారులు వెల్లడించారు.
కొవిడ్ నిబంధనలు పాటించండి