న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత్ మండపంలో కృత్రిమ మేధపై సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సదస్సులో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన(AI Summit Protest Case) చేపట్టారు. పైదుస్తులు విప్పి ఆందోళనకు దిగారు. అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్ను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
క్యూఆర్ కోడెడ్ పాసులను ఉపయోగించి ఏఐ సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశించిన సుమారు 10 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హాల్ నంబర్ 5 లోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇవాళ పాటియాలా హౌజ్ కోర్టులో ఈ ఘటనపై వాదనలు జరిగాయి. నలుగురు నిందితుల బెయిల్ను కోర్టు తిరస్కరించింది. అరెస్టు అయిన వారిలో యూత్ కాంగ్రెస్ సభ్యులు కృష్ణ హరి, కుందర్ యాదవ్, అజయ్ ఉన్నారు. నలుగురిని అయిదు రోజుల పోలీసు కస్టడీలోకి పంపారు.
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఓ కుట్ర ప్రకారం నిరసన చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ యువతను వాడుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఇంత కన్నా సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడం ఎప్పుడు ఆపేస్తారని మంత్రి రిజిజు ప్రశ్నించారు. ఏఐ సమ్మిట్లో జరిగిన ఘటనను యావత్ దేశం ఖండిస్తున్నదన్నారు. యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ నేరానికి పాల్పడినట్లు ఆరోపించారు.