న్యూఢిల్లీ: రైలులో టీ కొన్న ఒక ప్రయాణికుడు షాకయ్యాడు. కప్పు టీ రూ.20 కాగా, దానికి అదనంగా సర్వీస్ చార్జీ కింద రూ.50 వసూలు చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు కప్పు టీ కోసం రూ.70 చెల్లించాల్సి వచ్చింది. జూన్ 28న ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి భోపాల్కు శతాబ్ది రైలులో ప్రయాణించాడు. అయితే రైలు ప్రయాణంలో ఐఆర్సీటీసీ సిబ్బంది నుంచి టీ కొన్న అతడు షాక్ అయ్యాడు. కప్పు టీ రూ.20 కాగా రూ.50 సర్వీస్ చార్జీ అదనంగా వసూలు చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు రూ.70 చెల్లించి కప్పు టీ కొనాల్సి వచ్చింది. షాకైన ఆయన దీనికి సంబంధించిన రసీదులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అయితే బిల్లులో సర్వీస్ చార్జీ అని ఉండగా జీఎస్టీగా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు కప్పు టీ కోసం రూ.70లు రైల్వే వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రైల్వే అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జీకి సంబంధించి 2018లో జారీ చేసిన నోటీస్ను గుర్తు చేశారు. దీని ప్రకారం రాజధాని, శతాబ్ది లేదా దురంతో రైళ్లలో ప్రయాణికుడు టికెట్ రిజర్వేషన్ సందర్భంగా మీల్స్ ఆర్డర్ చేయకపోతే ఎలాంటి సర్వీస్ చార్జీ వసూలు చేయరు. అయితే రైలులో టీ లేదా కాఫీ లేదా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు సర్వీస్ చార్జీగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. కప్పు టీ లేదా కాఫీకి అయినా ఇదే వర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఫుడ్ ఆర్డర్ తప్పనిసరి కాగా ప్రస్తుతం ఐచ్ఛికం కావడం వల్ల ఈ నిబంధన తెచ్చినట్లు వెల్లడించారు.