న్యూఢిల్లీ: అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో మూడు గంటలు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్కు టేకాఫ్ అయ్యి మూడు గంటలకుపైగా ప్రయాణించింది. అయితే భార్యతోపాటు అందులో ప్రయాణించిన అమెరికా జాతీయుడు విమానం ఆకాశంలో ఉండగా చనిపోయాడు. దీంతో ఆ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు.
ఎయిర్ ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ-నెవార్క్ (యుఎస్) విమానం మూడు గంటలకుపైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది’ అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఎయిర్పోర్ట్లోని వైద్యులు విమానంలోకి వచ్చి ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారని చెప్పారు. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు.
కాగా, ఫ్లైట్ టైమ్ డ్యూటీ లిమిటేషన్ (FDTL) నిబంధనల ప్రకారం విమాన కార్యకలాపాల కోసం మరొక బ్యాచ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. కొత్త సిబ్బందితో అదే విమానం సాయంత్రం 4 గంటలకు అమెరికాకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.