న్యూఢిల్లీ, మార్చి 29: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ర్టాల్లో మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకొనేందుకు అధికార పార్టీలు పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకాల్ని ఎంచుకున్నాయి. రాజకీయ పార్టీల విజయావకాశాలను మెరుగుపరిచే వ్యూహంగా నగదు బదిలీ పథకం మారిపోయింది. మొత్తం నాలుగు రాష్ర్టాల్లో మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ ద్వారా ఇప్పటికే అందజేస్తున్న సొమ్ము రూ.24,500 కోట్లుగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే మరో ఐదేండ్లపాటు ఈ పథకాలు కొనసాగుతాయని ఆయా పార్టీలు హామీ ఇస్తున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకే ‘స్పెషల్ సమ్మర్ ప్యాకేజ్’ కింద ప్రతి మహిళకు రూ.2,000 ఇప్పటికే అందజేసింది. అస్సాంలో బీజేపీ ‘బిహు బోనస్’ కింద 40 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.4,000 జమచేసింది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో 10 లక్షల మంది మహిళలకు ప్రతినెలా రూ.1,000 అందించే పథకం మొదలైంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ సర్కార్ ఫిబ్రవరిలో ‘లక్ష్మీ భండార్’తో అందజేస్తున్న మొత్తాన్ని రూ.500 పెంచింది. మొత్తం ఈ నాలుగు రాష్ర్టాల్లోని 17.89 కోట్ల మంది మహిళల్లో 4.1 కోట్ల మంది మహిళలు నగదు బదిలీ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారు.
నగదు బదిలీ సాయం 2,000కు పెంపు: డీఎంకే
తమిళనాడులో అధికార డీఎంకే మహిళా ఓటర్ల కోసం భారీగా ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. తమను గెలిపిస్తే.. ప్రతి మహిళకు రూ.8,000 కూపన్, ప్రతి నెలా నగదు బదిలీ ద్వారా అందిస్తున్న సాయం రూ.2,000కు పెంచుత్తామని, రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆదివారం ఆయన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. నగదు బదిలీ, ఆర్థిక మద్దతు, సామాజిక మౌలిక సదుపాయాల పేరుతో మహిళా ఓటర్లపై వరాల జల్లును కురిపించారు. మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ ‘ఇల్లతరుసు’ పథకాన్ని స్టాలిన్ ప్రవేశపెట్టారు. గృహోపకరణాల కొనుగోలు కోసం రూ.8,000 కూపన్లు, స్వయం సహాయక బృందాల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని మహిళలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం చేసే మహిళల కోసం, వారి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసే 1,000 శిశు సంరక్షణ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తామని డీఎంకే వెల్లడించింది.
అస్సాంలో ప్రతి మహిళకూ రూ.50 వేలు సాయం: కాంగ్రెస్
అస్సాంలో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళలపై పెద్ద ఎత్తున హామీలు గుమ్మరించింది. ఎలాంటి షరతుల్లేని నగదు బదిలీ పథకాన్ని మహిళల కోసం తీసుకొస్తున్నట్టు కాంగెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.