న్యూఢిల్లీ : పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill) ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కే. కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఒకరోజు దీక్షకు విపక్షాలు బాసటగా నిలిచాయి. భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న కవిత దీక్షలో పలువురు విపక్ష నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. విపక్ష పార్టీలన్నింటినీ దీక్షకు ఆహ్వానించగా ఇప్పటివరకూ పదికి పైగా పార్టీలు హాజరుకానున్నట్టు తెలిపాయి. దీక్షను ప్రారంభించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ను డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఆమోదం పొందేవరకూ తాము వెన్నంటిఉంటామని హామీ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఏచూరి స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిందని ఏచూరి గుర్తుచేశారు.
కవిత దీక్షలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, చిత్ర సర్వార, నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) శివసేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్సీపీ), కే.నారాయణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్పీ), శ్యామ్ రాజక్ (ఆర్ఎల్డీ), కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More :