న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆకాశంలో మంగళవారం సాయంత్రం అద్భుత దృశ్యం కనిపించింది. గగన వీధిలో ఏర్పడిన పాక్షిక సూర్యగ్రహణం చూపరులకు కనువిందు చేసింది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావడంతో సాయంత్రం 4.17 గంటల సమయంలో గ్రహణం ప్రారంభమైంది. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పలు సమయాల్లో ఈ గ్రహణం కనిపించింది. శ్రీనగర్లో అత్యధికంగా 55 శాతం సూర్యుడిని చంద్రుడి నీడ కవర్ చేయగా, జమ్ములో 52%, ఢిల్లీలో 43%గా ఉన్నది. ఇక బెంగళూరులో 9.9 శాతం, కొచ్చిలో 5.1 శాతం గ్రహణం కనిపించింది. 20 ఏండ్ల అనంతరం దీపావళి తర్వాత ఏర్పడిన సూర్యగ్రహణం కావడంతో ఎంతో ప్రత్యేకత సంతరించుకొన్నది. ఆసక్తిగల వారు టెలిస్కోప్లో సాయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని గ్రహణాన్ని వీక్షించగా.. విశ్వాసాలు ఉన్నవారు గ్రహణాన్ని చూడకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. గ్రహణం అనంతరం ఆలయాల సమీపంలోని నదులు, సరస్సుల్లో స్నానాలు ఆచరించారు.