లక్నో: నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. వంతెనపై నిర్మిస్తున్న రెండు బీములు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (under construction bridge collapses) గజ్రౌలా గ్రామం నుంచి అమ్రోహాలోని విరంపూర్ గ్రామం వరకు రూ.83 కోట్ల వ్యయంతో గంగా నదిపై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), సేతు నిగమ్ పర్యవేక్షణలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి వేళ వంతెనకు చెందిన రెండు బీములు కూలిపోయాయి. అయితే భారీ గాలితో కూడిన వర్షం వల్ల ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు.
మరోవైపు నాణ్యత లేని నిర్మాణ సామగ్రిని వినియోగించడం వల్ల ఈ వంతెనకు చెందిన రెండు బీములు కూలినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు వీటిని ఖండించారు.