న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే గురువారం వాయిదా పడే అవకాశం ఉన్నది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశాలు జనవరి 31న ప్రారంభం కాగా.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న ముగియాల్సి ఉన్నది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, ప్రిసైడింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లను సంప్రదించినట్లుగా సమాచారం.
అయితే, గురువారం లంచ్ అవర్కి ముందే సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు సైతం పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ఐదు రోజుల ముందుగానే వాయిదా పడిన విషయం విధితమే. సెషన్ సమయంలో ప్రభుత్వం ముందు సభలో ఎలాంటి ఏజెండా పెండింగ్లో లేదని ఓ సీనియర్ పార్లమెంటేరియన్ పేర్కొన్నారు. అయితే, సమావేశాలు త్వరగా ముగించడం ద్వారా ఇంధన ధరల పెంపుపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం లభించకపోవచ్చని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు.
అన్ని ముఖ్యమైన ఆర్థిక, వివిధ మంత్రిత్వ శాఖల కేటాయింపు బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. క్రిమినల్ ఐడింటిఫికేషన్ సవరణ బిల్లు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ ఆమోదంతో ఢిల్లీలో ఉన్న మూడు కార్పొరేషన్ల స్థానంలో ఒకటే ఉండనున్నది. 2020లోనూ కొవిడ్ కేసులు, 2021లో బడ్జెట్ వర్షాకాల సమావేశాలను సైతం ముందస్తుగానే ముగిశాయి. సమావేశాల అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.