న్యూఢిల్లీ, మార్చి 14: వందే భారత్ రైళ్ల నిర్మాణంలో జాప్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022-23లో 35 వందే భారత్ రైళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం ఎనిమిది మాత్రమే డెలివరీ చేయగలిగిందని, లక్ష్యానికి చాలా దూరంగా నిలిచిపోయిందని పేర్కొన్నది. ప్రయాణికుల డిమాండ్, ఆకాంక్షలకు అనుగుణంగా వందే భారత్ ట్రైన్లు, కోచ్ల ఉత్పత్తిని వేగవంతం చేయాలని రైల్వే శాఖను కోరింది.
2023-24కు సంబంధించి ‘డిమాండ్ ఫర్ గ్రాంట్స్’పై తన 14వ నివేదికను ఎంపీ రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని కమిటీ సోమవారం సమర్పించింది. వందే భారత్ రైళ్ల నిర్మాణంలో ఆలస్యంపై తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసిన కమిటీ.. ఇలా అయితే రైల్వే శాఖ తాను పెట్టుకొన్న లక్ష్యాలను చేరుకోవడం కష్టమేనని పేర్కొన్నది. వందే భారత్ రైళ్లు, కోచ్లను తయారు చేసేందుకు ఇతర ప్రొడక్షన్ యూనిట్లకు సాంకేతిక మద్దతు ఇవ్వాలని రైల్వే శాఖకు సూచించింది.