న్యూఢిల్లీ, ఆగస్టు 24: పౌరుల డాటా రక్షణ, గోప్యత అంశాలపై చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ శుక్రవారం ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ట్విట్టర్ అధికారులతో సమావేశం కానున్నది. ఈ మేరకు వాటికి సమాచారం పంపించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు అంశాలను చర్చించనున్నది. ఐఆర్సీటీసీకి 10 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు.
ఇందులో 7.5 కోట్ల మంది క్రియాశీలక వినియోగదారులు. రూ.1000 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో ప్రయాణికులు, రవాణా వినియోగదారుల డాటాను పర్యవేక్షించడానికి కన్సల్టింగ్ వ్యవస్థను నియమించుకోవడానికి ఐఆర్సీటీసీ టెండర్లు ఆహ్వానించింది. పార్లమెంటరీ ప్యానల్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నారు. వ్యక్తిగత డాటా రక్షణ బిల్లు-2019ను ఆగస్టు 3న ఉపసంహరించుకున్న కేంద్రం సమకాలిన డిజిటల్ గోప్యతా చట్టల బిల్లు తీసుకొచ్చేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నది. థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానల్.. టెక్ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు, వివిధ మంత్రిత్వశాఖలు, పలు విభాగాలవారీతో చర్చలు జరుపుతున్నది. ఇందులో భాగంగానే శుక్రవారం సమావేశం జరుగనున్నది.