న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంటు వర్షకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 29 సాధారణ బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నది. ఇందులో మూడు బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్ల స్థానంలో తీసుకురావడానికి ఉద్దేశించినవి. ‘రక్షణ ఉత్పత్తుల సంస్థల్లో పనిచేస్తున్నవారు నిరసనలు తెలుపకూడదు’ అన్న వివాదాస్పద బిల్లు కూడా ఈ జాబితాలో ఉన్నది. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించేలా కేంద్రానికి అధికారం కల్పించే కొత్త సినిమాటోగ్రఫీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. మరోవైపు, కరోనా కట్టడి, మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో కేంద్రం వైఫల్యం, వ్యవసాయ చట్టాలు, సరిహద్దుల్లో చైనా దూకుడుపై మాటల దాడి చేయడానికి ప్రతిపక్షాలు అస్ర్తాలను సిద్ధం చేసుకొన్నాయి. అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలపై నిలదీయనున్నాయి. అయితే, అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన, అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. సమావేశాల సమయంలో పార్లమెంటు వద్ద రైతులు నిరసన తెలుపుతారని కిసాన్ సంయుక్త మోర్చా ఇదివరకే ప్రకటించింది.
ఎంపీల్యాడ్స్ను పునరుద్ధరించాలి
వర్షకాల సమావేశాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఆదివారం అఖిల పక్ష భేటీ జరిగింది. సమావేశానికి 33 పార్టీలు హాజరయ్యాయి. ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు విపక్షాల నేతలు అఖిలపక్షంలో డిమాండ్ చేశారు. ఈ భేటీకి ప్రధాని మోదీ హాజరు కాలేదు. కాగా, ఆదివారం ఎన్డీయే ఫ్లోర్ లీడర్లతో ప్రధాని భేటీ అయ్యారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారు. 280 మంది మాత్రమే లోక్సభ ప్రధాన చర్చ ప్రాంగణంలో కూర్చొంటారు. మరో 259 మంది సందర్శకుల గ్యాలరీలో కూర్చొంటారు. రాజ్యసభలోనూ ఇదే ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ, లోక్సభ రెండింట్లో ఒకేసారి, ఉదయం 11 గంటల నుంచి చర్చలు జరుగుతాయి.
ఏదైనా సభల్లోనే చెప్పండి
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తామని, కరోనా కట్టడిపై మోదీ రెండు సభలను ఉద్దేశించి సోమవారం ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిల పక్షంలో ప్రతిపాదించారు. దీనిని విపక్షాలు తిరస్కరించాయి. ‘కొవిడ్పై సభలోనే చర్చించకుండా.. బయట ఎందుకు? ఇది చర్చ నుంచి తప్పించుకోవడమే. పార్లమెంటును అపహాస్యం చేయడమే’ అని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శించారు. అయితే ఈ ప్రతిపాదనను ఎన్సీపీ చీఫ్ పవార్ వ్యతిరేకించకపోవడం గమనార్హం.