న్యూఢిల్లీ: వలస పాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రతిపాదించిన బిల్లులను హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలించి, నివేదికను శుక్రవారం రాజ్యసభకు సమర్పించింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులను ఈ కమిటీ పరిశీలించింది.
మైనర్లపై అత్యాచారం, జంతువులతో సంభోగం నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని సిఫారసు చేసింది. అదేవిధంగా వ్యభిచారం నేరానికి సంబంధించిన నిబంధనలను స్త్రీ, పురుష, నపుంసకులకు సమానంగా వర్తించేలా చేయాలని తెలిపింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య వంటి నేరాలకు సంబంధించిన నిబంధనలపై కూడా పలు సిఫాసులు చేసింది.