Parliament Monsoon Session | జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. జూలై 18 నుంచి ఆగస్టు 12వరకు సమావేశాలు జరుగుతాయని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే (జూలై 18) రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీ చేయగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. కొత్త రాష్ట్రపతి జూలై 15న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణం చేస్తారు.
ఇక ఆగస్టు ఆరో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా,
జూలై 18-ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) ఇటీవల ప్రతిపాదించింది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రెండు రోజులు ముందుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిస్తున్నారని తెలుస్తున్నది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 18 రోజులు సభ సమావేశం కానున్నది. ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఇవే ఆఖరి సమావేశాలని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.