parliament| న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జేపీసీతో విచారణ వంటి అంశాలపై మోదీ సర్కారును నిలిదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం వ్యూహాలకు పదునుపెట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 ప్రతిపక్ష పార్టీలు రెండు రోజుల పాటు బెంగళూరులో సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తమ కూటమికి ఇండియా అనే పేరును ఖరారు చేశాయి. విపక్షాలకు పోటీగా అధికార బీజేపీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగనున్నాయి. ప్రతిపక్షాల ఐక్యతకు ఈ సమావేశాలు తొలి పరీక్షగా నిలువనున్నాయి.
పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్రం బుధవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. మణిపూర్ ఘర్షణలపై పార్లమెంట్లో చర్చ జరుగాలని ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కోరాయి. చర్చకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఢిల్లీలో అధికారాలపై పరిధిపై కేంద్రం జారీచేసిన అర్డినెన్స్పైనా సమావేశంలో చర్చ జరిగింది. గవర్నర్ల వ్యవస్థ ద్వారా దేశ సమాఖ్య నిర్మాణానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మణిపూ్ర్ ఘర్షణలు, బాలాసోర్ రైలు ప్రమాదం, పీఎంఎల్ఏ పరిధిలోకి జీఎస్టీఎన్ తీసుకురావడం వంటి అంశాలను పార్లమెంట్లో లేవనెత్తనున్నట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. అదానీ-హిండెన్బర్గ్ అంశంపైనా చర్చకు పట్టుబడుతామన్నారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో 21 బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు వంటి కీలక బిల్లులు ఉన్నాయి. అటవీ సంరక్షణ సవరణ బిల్లు, జనవిశ్వాస్ సవరణ బిల్లు, బయోలాజికల్ డైవర్సిటీ సవరణ బిల్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లు తదితర బిల్లులను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.