న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా నియమాలను ఉల్లంఘించి లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్ను ప్రయోగించడం ద్వారా గందరగోళం సృష్టించిన కేసులో ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాకి ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. కాగా, ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు.
పార్లమెంట్ లోపల యెల్లో గ్యాస్ దాడికి పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్తోపాటు వెలుపల కూడా యెల్లో గ్యాస్తో గందరగోళం సృష్టించిన నీలం దేశీ, అమోల్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నలుగురు నిందితులను గురువారమే కోర్టులో హాజరుపర్చగా కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం USPA కింద అభియోగాలు నమోదు చేశారు. మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీని గురుగ్రామ్లోని అతని ఇంటిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
విప్లవ భావజాలంగల వీళ్లంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఒకవేళ ప్లాన్-ఎ విఫలమైతే, ప్లాన్-బీకి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కుట్ర పన్నినట్లు వెల్లడైంది. రైతుల నిరసన, మణిపూర్ అంశం, నిరుద్యోగం వంటి సమస్యలతో కలత చెందడంవల్లే తాము ఈ దాడికి పాల్పడ్డామని నిందితులు తెలిపారు.