న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత పార్లమెంట్పై (Parliament) ఉగ్రదాడిని నిలువరించి, తమ ప్రాణాలను అర్పించిన వీరులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. 2001 డిసెంబరు 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్ర దాడిలో (Parliament attack) ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి కోవింద్తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు.
‘2001లో సరిగ్గా ఇదేరోజున ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
భారత ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రదాడిలో జాతి గర్వాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల ధైర్యానికి, పరాక్రమానికి వందనం చేస్తున్నానని తెలిపారు. భద్రతా బలగాల అసమాన శౌర్యం, త్యాగం దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ తమకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ మేరకు అమిత్ షా ట్వీట్ చేశారు.
పార్లమెంట్ హౌస్పై దాడి సందర్భంగా ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విధి నిర్వహణలో వారి ధైర్యానికి, త్యాగానికి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతో ఉంటుందన్నారు.