PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘వీధి పశువుల వల్ల రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారని నాకు తెలుసు. ఎన్నికల ఫలితాలు రానీయండి. మళ్లీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రైతుల సమస్యలను చిటికెలో పరిష్కరిస్తా..’ ఇదీ 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అక్కడి రైతుల కిచ్చిన హామీ. ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. కొద్ది నెలల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయినా మోదీ రైతులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి పశువుల సమస్య తీరలేదు. వందల ఎకరాల పొలాల్లో ఈ పశువులు పంటను మేస్తూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి రైతులు పండించుకొంటున్న పంటను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి.
అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇచ్చిన హామీ ప్రకారం సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల యూపీలోని లఖింపూర్ ఖేరీలోని ప్రాథమిక పాఠశాలలో రైతులు వీధి పశువులను కట్టేసి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో రైతులు ఇదేవిధంగా నిరసన తెలియజేస్తున్నారు. విచ్చలవిడిగా తిరుగుతూ నష్టం చేకూరుస్తున్న వీధి పశువుల సమస్యను పరిష్కరించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలలో వీధి పశువులను తీసుకొచ్చి పాఠశాలల్లో నిర్బంధిస్తున్నారు.
ఖేత్ సురక్ష యోజన ఏమైంది?
వీధి పశువుల బెడద నుంచి రైతులను ఉపశమనం కలిగించేందుకు ఖేత్ సురక్ష యోజన అమలు చేస్తామని యోగి సర్కార్ ఇచ్చిన హామీ ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీధి పశువుల సమస్యను వాడుకుని బీజేపీ లబ్ధి పొందిందని, అయితే పరిష్కారానికి చిత్తశుద్ధి చూపటం లేదని రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పథకం కింద రైతులకు హెక్టారుకు రూ.1.43 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంతవరకు అమలు కాలేదు.
పశువుల పేరుతో ఓట్లు దండుకొన్నారు
ఎన్నికలకు ముందు వీధి పశువుల సమస్య పరిష్కరిస్తామని బీజేపీ ఓట్లు దండుకొన్నది. గెలిచిన తర్వాత సమస్య పరిష్కారాన్ని గాలికి వదిలేసింది. వీధి పశువుల నిర్వహణ పేరుతో పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజల నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేసింది. కానీ ఆ పశువులు మాత్రం ఇంకా వీధుల్లోనే తిరుగుతున్నాయి.
– జోగిందర్, రైతు నాయకుడు