(స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ) హైదరాబాద్, అక్టోబర్ 7: ‘ప్రజల హృదయాల్లో నేను ఉన్నంత కాలం.. ప్రధాని నరేంద్రమోదీ కూడా నా రాజకీయ జీవితానికి చెక్ పెట్టలేరు’- ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో బీజేపీయేతర నేత కాదు. సాక్షాత్తూ బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజ ముండే. గతవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకొన్నట్టు బహిర్గతమైంది.
అమీతుమీకి సై
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారును కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకొన్న కమలదళంపై దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండే మరోసారి తీవ్ర అసంతృప్తి వెల్లగక్కారు. సీనియర్ నేతల పేర్లను ప్రస్తావించనప్పటికీ, బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు. పార్టీలో తన ప్రాముఖ్యాన్ని తగ్గిస్తుండటాన్ని ప్రజాక్షేత్రంలో పరోక్షంగా ఎత్తిచూపారు.
రెండు రోజుల క్రితం బీడ్లో జరిగిన ఓ సభలో ఆమె మాట్లాడుతూ.. 2024 ఎన్నికల కోసం అన్ని విధాలుగా తాను సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీచేస్తానని ఒకవైపు పేర్కొంటూనే.. టికెట్ కోసం తాను ఎవరి ముందూ తలవంచబోనని బీజేపీ నేతలకు చురకలు అంటించారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిని కాకపోయినా తన ప్రసంగాన్ని వినడానికి వేల మంది వచ్చారని తనకున్న మద్దతును పరోక్షంగా ఎత్తిచూపారు. ఇతరులను తొక్కేస్తూ పైకి రాలేదని పరోక్షంగా పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రాధాన్యం తగ్గింపు..
మరఠ్వాడాలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న వంజారి కమ్యూనిటీకి చెందిన పంకజ ముండే, గత ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తమ కుటుంబానికి కంచుకోటగా పిలిచే బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తనకు సోదరుడి వరుసయ్యే ధనంజయ్ ముండే (ఎన్సీపీ) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. స్థానిక బీజేపీ నేతల కుట్ర కారణంగానే తాను ఓడిపోయానని ముండే చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి. రాష్ట్ర బీజేపీలో తనకు కీలక పదవి దక్కుతుందని భావించిన ఆమెకు తర్వాత కూడా నిరాశే ఎదురైంది.
పార్టీ జాతీయ కార్యదర్శిగా ముండేను నియమిస్తూ 2020లో అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నది. ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ను ఆశించినా భంగపాటు తప్పలేదు. ఇవన్నీ ఆమెలో అసహనానికి ఆజ్యాన్ని పోశాయి. అందుకే.. ఇటీవల జరిగిన బహిరంగ సభలో.. ‘చినుకులు మహా సముద్రంగా ఎలా మారుతాయో.. 2024 ఎన్నికల్లో చూపిద్దాం’ అంటూ అనుచరులకు పిలుపునిచ్చారు. కాగా, ముండే తమ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తామని శివసేన, ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించాయి.