బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఓ చిరుత హల్చల్ చేసింది. ఔటర్ బెంగళూరు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏరియాలో భారీ కేజ్లను ఏర్పాటు చేశారు. అయితే చిరుత జింకను వేటాడిన ఆనవాళ్లు కూడా లభించాయి. గత రెండు రోజుల నుంచి తురహళ్లి ఫారెస్ట్ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా బెంగళూరు సిటీ డిప్యూటీ కన్జర్వేటర్ ఎస్ఎస్ రవి శంకర్ మాట్లాడుతూ.. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. బన్నేరగట్ట నేషనల్ పార్కుతో పాటు ఫారెస్టు దగ్గరగా ఉండటంతో చిరుత సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏరియాలో కేవలం ఒక చిరుత మాత్రమే ఉందన్నారు. కొందరు నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు వైరల్ చేస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.