జమ్ము, ఆగస్టు 17: కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరో పండిట్ హత్య కశ్మీరీ పండిట్లలో ఆందోళనలను మరింత రేపింది. కొనసాగుతున్న లక్షిత హత్యల నేపథ్యంలో పీఎం ప్యాకేజీ ఉద్యోగులను కశ్మీర్ లోయ నుంచి జమ్ముకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ పండిట్లు బుధవారం భారీ ఆందోళన చేపట్టారు.
ఉగ్రవాదులకు మమ్మల్ని బలి పెడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జమ్ములోని రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ఎదుట వందలాది మంది ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. మంగళవారం షోపియాన్ జిల్లాలో సునీల్ కుమార్ భట్ హత్యకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేశారు.
కశ్మీరీ పండిట్ సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై.. పండిట్ ఉద్యోగులకు న్యాయం చేయాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అంటూ నినాదాలు చేశారు. తావి బ్రిడ్జిపై ధర్నాకు కూర్చోవడంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులు బలవంతంగా పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్యోగులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
పండిట్ల హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మమ్మల్ని కశ్మీర్ లోయ నుంచి జమ్ము తరలించాలనే ఏకైక డిమాండ్ చేస్తున్నామని ఆందోళనల్లో పాల్గొన్న సునీల్ అనే ఉద్యోగి పేర్కొన్నారు. అక్కడ పనిచేసి ఉగ్రవాదులకు తమను తాము బలిచేసుకోలేమని అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల బుల్లెట్లకు మరణించే బదులు.. ఉద్యోగం లేకున్నా జమ్ములో ఆకలితో చావడం మేలని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు.
కశ్మీర్లో పోస్టింగ్లు ఇచ్చిన వందలాది మంది పండిట్ ఉద్యోగులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. తమను జమ్ములోని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కూడా వారి క్యాంపుల వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు.