ఇంఫాల్: మణిపూర్లో చెలరేగిన హింస(Manipur Violence)పై జుడిషియల్ విచారణకు కేంద్రం ఆదేశించింది. ప్రత్యేక సీబీఐ బృందం చేపడుతున్న విచారణను పర్యవేక్షించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మణిపూర్లో జరుగుతున్న వర్గ పోరును దర్యాప్తు చేసేందుకు పలు ఏజెన్సీలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, ఆరు సంఘటనల్లో కుట్ర ఉన్నట్లు సీబీఐ ఉన్నత స్థాయి దర్యాప్తులో తేలిందని, అయితే విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని షా తెలిపారు. మణిపూర్ సంక్షోభాన్ని చర్చలతోనే పరిష్కరించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
మణిపూర్లో హింసను నియంత్రించే ఉద్దేశంతో.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన చేపట్టారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో పీస్ కమిటీ ఉంటుందన్నారు. అల్లర్లలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు 8 డాక్టర్ల బృందంలో ప్రస్తుతం మణిపూర్లో ఉన్నాయి. ఖోంగ్సాంగ్ రైల్వే స్టేషన్ వద్ద తాత్కాలిక ప్లాట్ఫామ్ను వేగంగా నిర్మిస్తున్నామని, దీన్ని వారంలోగా ఆపరేషన్ స్థాయికి తీసుకువస్తామన్నారు.
ఫేక్ న్యూస్ పట్ల దృష్టి పెట్టవద్దు అని మణిపూర్ ప్రజల్ని ఆయన కోరారు. ఆయుధాలతో తిరుగుతున్నవారు వాటిని పోలీసులకు వెంటనే అప్పగించాలన్నారు. రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభంకానున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యాశాఖకు చెందిన అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారని, నిరాటంకంగా విద్యాబోధన కొనసాగించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం 5 లక్షలు, రాష్ట్రం 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మణిపూర్ కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్ను నియమించారు. ఆ రాష్ట్ర పోలీసుశాఖ చీఫ్గా ఇక ఆయన కొనసాగనున్నారు. హోంశాఖ ఓఎస్డీగా పీ డొంగోల్ను నియమించారు. ఇప్పటి వరకు మణిపూర్లో జరిగిన వర్గ హింసలో దాదాపు 40 మందికిపైగా మరణించారు.