ముంబై, జూన్ 28: దేశీయ వ్యాపార దిగ్గజం షాపూర్ పల్లోంజీ గ్రూపు చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా సన్స్ చైర్మన్గా విధులు నిర్వహించిన ఆయన టాటా గ్రూపులో మెజార్టీ 18.37 శాతం వాటా కలిగివున్నారు. పల్లోంజీ మిస్త్రీ మృతి పట్ట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. వీరితోపాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరితోపాటు పలువురు సంతాపం తెలిపారు. 1929లో జన్మించిన పల్లోంజి మిస్త్రీ ప్రారంభంలో నిర్మాణ రంగంలో వ్యాపారం నిర్వహించారు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్, షిప్పింగ్, గృహోపకరణాల విభాగాలకు విస్తరించిన ఎస్పీ గ్రూపును 5 బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దారు. పార్శి కుటుంబంలో 1929లో గుజరాత్లో జన్మించిన ఆయన..ప్రారంభంలో షాపూర్ పల్లోంజీ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. తన వ్యాపారాన్ని దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మార్చారు. అక్కడ భారీ స్థాయిలో భవంతులను నిర్మించారు. వీటిలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవంతులు ఉండటం విశేషం.
2011-2016 వరకు టాటా సన్స్ చైర్మన్గాను..
టాటా సన్స్లో మెజార్టీ వాటాగా ఉన్న షాపూర్ పల్లోంజీ మిస్త్రీ..2011 నుంచి 2016 మధ్యకాలంలో టాటా సన్స్ చైర్మన్గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత తన కుమారుడైన సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిం ది. సైరస్ మిస్త్రీ-రతన్ టాటాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు రావడంతో ఇరువురు కోర్టుకెక్కారు.
‘షాపూర్ పల్లోంజీ మిస్త్రీ మృతి వ్యాపార రంగానికి తీరనిలోటు. సంపద సృష్టిలో ఆయన పాత్ర అమోఘం’
– రామ్ నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
‘ప్రపంచ వాణిజ్య, పరిశ్రమల రంగాల్లో ఆయన చిరస్మరణీయుడు’
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ
జననం: 1, జూన్ 1929(గుజరాత్లో)
మరణం: 28, జూన్ 2022
భార్య: పాట్ పెరిన్ దుబాష్
సంతానం: ఇద్దరు కుమారులు
(సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ),
ఇద్దరు కుమార్తెలు
(అలూ మిస్త్రీ, లైలా మిస్త్రీ)
కంపెనీ: షాపూర్ పల్లోంజీ గ్రూపు చైర్మన్
అవార్డులు: 2016లో పద్మ భూషణ్
సంపద: 2021 నాటికి 28 బిలియన్ డాలర్లు
(రూ.2 లక్షల కోట్లకు పైమాటే)