శ్రీనగర్: పాకిస్థాన్కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతలో భద్రతా దళాలు అతడ్ని గుర్తించాయి. పాక్ చొరబాటుదారుడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎందుకు చొరబడ్డాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. (Pakistani Intruder Arrested) గురువారం ఉదయం జమ్మూలోని కనాచక్ సెక్టార్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ జాతీయుడైన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. సరిహద్దులోని సున్నిత ప్రాంతమైన సోహన్ బోర్డర్ అవుట్పోస్ట్ (బీవోపీ) ఫార్వర్డ్ ఏరియాలో గస్తీ విధుల్లో అప్రమత్తంగా ఉన్న 44వ బెటాలియన్ దళాలు పాక్ చొరబాటుదారుడిని పట్టుకున్నాయి.
కాగా, జమ్మూలోని కనాచక్ సెక్టార్కు ఎదురుగా ఉన్న పాకిస్థాన్లోని సియాల్కోట్ జిల్లా లూని గ్రామానికి చెందిన నజీర్గా ఆ చొరబాటుదారుడిని గుర్తించారు. బీఎస్ఎఫ్ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ జాతీయుడు పొరపాటున సరిహద్దు దాటి వచ్చాడా? లేక భవిష్యత్తులో ఉగ్రవాదులను సరిహద్దులోకి పంపేందుకు సైనికుల అప్రమత్తతను పరీక్షించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడా? లేక ఇతర కారణాలున్నాయా? అన్నది తెలుసుకునేందుకు నజీర్ను ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న కనాచక్ సెక్టార్ డీఐజీ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్థాన్ వ్యక్తి చొరబాటు గురించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.