Boat @ Sutlez River | పంజాబ్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో సెక్యూరిటీ బ్రీచ్ జరిగిన వేళ.. అక్కడికి 50 కి.మీ. దూరంలో సట్లెజ్ నదిలోకి పాకిస్థాన్ పడవ ఒకటి వచ్చినట్లు తెలుస్తున్నది. బీఎస్ఎఫ్ జవాన్లు దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఖాళీగా ఉంది. దీనిపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. సట్లెజ్ నదిలోకి ఈ పడవ ఎప్పుడు వచ్చిందో తెలియదు. ప్రధానికి భద్రతా లోపంపై దేశవ్యాప్త చర్చ జరుగుతుండగా, ఈ పడవ దొరకడం గమనార్హం. బీఎస్ఎఫ్ జవాన్లు సమీప ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అధికార వర్గాల కథనం ప్రకారం భారత్లోకి ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేయడానికి ఈ పడవ వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా పలు దఫాలు సరిహద్దు ప్రాంతాలకు సమీపం నుంచి డ్రోన్ల ద్వారా రవాణా చేస్తారు.
ఇంతకుముందు 2018లో ఇదే తరహాలో పడవ కనిపించింది. దీనిపై విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది. హోంశాఖలోని సెక్యూరిటీ సెక్రటరీ సుధీర్ కుమార్, ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్సింగ్, ఎస్పీజీ ఐజీ ఎస్ సురేశ్ అందులో సభ్యులుగా ఉన్నారు. ఇక ఫిరోజ్పూర్ బార్డర్ సున్నితమైన ప్రదేశం. భారత్-పాక్ సరిహద్దుకు 50 కి.మీ. దూరంలో ప్రధాని మోదీ నిలిచిపోయారు.
ఇదే ప్రాంతంలో ఇటీవల టిఫిన్ బాంబు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భద్రతా ఏర్పాట్లపై పంజాబ్ పోలీసులు, చన్నీ ప్రభుత్వం వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిరోజ్పూర్ సరిహద్దుల్లో సట్లెజ్ నదిలో పడవ దొరికిన ప్రదేశానికి భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు చాలా సమీపంలో ఉంది.
హరికే బ్యారేజీ దాటిన తర్వాత సట్లెజ్ నది హుస్సేనీవాలా మీదుగా పాకిస్థాన్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి నదీ ప్రవాహం జిగ్జాగ్గా సాగుతుంది. పాక్లో ఎంటరైన తర్వాత తిరిగి భారత్లోని ఫిరోజ్పూర్, ఫాజిల్కా జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లోకి మళ్లుతుంది. తిరిగి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవహిస్తుంది.
గట్టి తెలువాలా మాల్ ఏరియా (ఫిరోజ్పూర్ జిల్లా)
దోనా తెలుమాల్వాలా ప్రాంతం (ఫిరోజ్పూర్ జిల్లా)
గట్టి మహ్ముద్కే హిథార్ ప్రాంతం (ఫిరోజ్పూర్ జిల్లా)
రాజారాయి ప్రాంతం (ఫిరోజ్పూర్ జిల్లా)
దోనా మిట్టర్ (ఫిరోజ్పూర్ జిల్లా)
దోనా బహాదుర్కే, గురు హరసహాయి ప్రాంతం (ఫిరోజ్పూర్)
వాలె సాహా హితార్, బగ్గుహట్టి (ఫాజిల్కా జిల్లా)