న్యూఢిల్లీ: భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాది( Pakistan Terrorist )ని మంగళవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. లక్ష్మీనగర్లోని రమేష్ పార్క్ ప్రాంతంలో మహ్మద్ అష్రఫ్ అనే ఈ ఉగ్రవాది ఉంటున్నాడు. అతని దగ్గరి నుంచి పోలీసులు ఏకే-47తోపాటు అదనంగా ఉన్న మ్యాగజైన్, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 2 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఉగ్రవాదిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడు పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడుగా గుర్తించారు. అతడు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు పండగల సీజన్ కావడంతో ఢిల్లీలోని అన్ని మార్కెట్లలో భద్రతను పెంచారు.