న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం బలహీనమైన స్థితిలో ఉన్నదని, ఆ దేశం అక్రమంగా ఆక్రమించిన మన భూభాగాన్ని ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోగలమని చెప్పారు. దీనిని ప్రధాని మోదీ ప్రభుత్వం తన అజెండాలో చేర్చుకోవాలని సూచించారు.
‘పాకిస్థాన్ అక్రమ ఆక్రమణ నుంచి పీఓకేను విడిపించడం మన బాధ్యత. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము పార్లమెంటులో తీర్మానం చేశాం. ఇప్పుడు, మోదీ ప్రభుత్వం తన అజెండాలో దీనిని కూడా చేర్చాలి. ప్రస్తుతం పాక్ బలహీనమైన స్థితిలో ఉంది. దీంతో పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం’ అని రావత్ అన్నారు.
#WATCH | Delhi: It's our duty to take back PoK, a proposal was passed regarding it in Parliament during Congress govt…This should be on Modi govt's agenda. Currently, Pakistan is in a weak condition, we should take back PoK: Former Uttarakhand CM & Congress leader Harish Rawat pic.twitter.com/x9p5PZfPbl
— ANI (@ANI) December 4, 2022
ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకేపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పీఓకే భారత్కు చెందిందని, సమయం వచ్చినప్పుడు వెనక్కు తెచ్చుకుంటామని గత నెల 30న చెప్పారు. పీఓకేపై భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలుచేసేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల స్పష్టంచేశారు.