జైపూర్ : ప్రముఖ న్యూరాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా(71) కొవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం మరణించారు. డాక్టర్ పనగారియా గడిచిన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో ఉన్నారు. గత రెండు రోజులుగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని శుక్రవారం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
పనగారియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని స్పందిస్తూ.. వైద్య రంగంలో తన కృషి భవిష్యత్ తరాల వైద్యులకు అదేవిధంగా పరిశోధకులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ జాతీయంగా ప్రఖ్యాతి చెందిన న్యూరాలజిస్ట్ కన్నుమూయడం వ్యక్తిగతంగా తనకు, ఆయన కుటుంబానికి వ్యక్తిగత నష్టమన్నారు. పనగారియా మృతిపై ఎనర్జీ మినిస్టర్ బిడి కల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు.