న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సోమవారం 2020 ఏడాదికి సంబంధించి 148 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ఇవాళ 2021 ఏడాదికిగాను 119 మందికి అవార్డులను అందజేశారు. ఇవాళ పద్మ అవార్డులు అందుకున్న 119 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఇదిలావుంటే ఇవాళ పద్మ అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. 16 మందికి మరణానంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూను, తెలుగు సినీరంగానికి చెందిన ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. ఇక లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్కి మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం దక్కగా.. ఆయన తరపున ఆయన సతీమణి అవార్డును అందుకున్నారు.
లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత రాంవిలాస్ పాశ్వాన్కు కూడా మరణానంతరం పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఆయన తరపున ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ అవార్డు తీసుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగలేదు. దాంతో 2020లో పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సోమవారం ఆ అవార్డులను ప్రదానం చేశారు. ఇవాళ 2021 ఏడాదికి సంబంధించిన అవార్డులను అందజేశారు.