న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం వినాశకర పాలన సాగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు. ప్రధాని మోదీ కేవలం ఎన్నికల్లో ఓటమికే భయపడతారని, మరి దేన్నీ లెక్కచేయరని వ్యాఖ్యానించారు. అసోం కాంగ్రెస్ కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణా శిబిరంలో చిదంబరం ప్రసంగిస్తూ వివిధ రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం కొనసాగితే దేశం కుప్పకూలడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి బయటపడేందుకు మోదీ ప్రభుత్వం మతాన్ని ఎక్కుపెట్టి దేశాన్ని విభజించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోదీకి తమ పార్టీ ఎంపీలు, సీఎంలు, మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, న్యాయమూర్తులు, దేవుడు ఇలా ఎవరన్నా లెక్కలేదని కేవలం ఎన్నికల్లో ఓటమి అంటేనే ఆయన భయపడతారని దుయ్యబట్టారు.
ఎలాంటి పరిస్ధితిలోనైనా ఎన్నికల్లో ఓటమిని ఆయన కోరుకోరని కనీసం ఒకదానికి గురించైనా ఆయన భయపడుతుండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికలోనూ మోదీని ఓడించడం ద్వారానే దేశాన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు. సరిహద్దులో చైనా మన భూభాగాన్ని ఆక్రమించి భవనాలు, గ్రామాలు నిర్మిస్తోందని, మరోవైపు కశ్మీర్లో యువత ఉగ్రబాటలో సాగుతున్నారని, దేశ ఆర్ధిక వ్యవస్ధ పతనావస్ధలో ఉందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు.