న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. భారత్లో ఇజ్రాయిల్ స్పైవేర్ను దుర్వినియోగం చేయడంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చించాలని ఆయన వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుండగా ప్రభుత్వం ఎంతకాలం దాటవేత వైఖరితో తప్పించుకుంటుందని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు.
ఫ్రాన్స్లో రఫేల్ ఒప్పందంలో అవకతవకలను బయటపెట్టిన మీడియాపార్ట్కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ను చొప్పించి హ్యాక్ చేశారని అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు వెల్లడించాయని చెప్పారు. రాజకీయ దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం జులై 19న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర అలజడి రేకెత్తిస్తోన్న సంగతి తెలిసిందే.