న్యూఢిల్లీ : వాడుకలో లేని ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం పట్ల మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ మానెటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) స్కీమ్ను పట్టపగలు దోపిడీగా చిదంబరం అభివర్ణించారు. గత 70 ఏండ్లుగా నిర్మించిన ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్తుల విలువతో పోలిస్తే వాటి అమ్మకం ద్వారా వచ్చే మొత్తం స్వల్పమని, కేవలం కొన్ని కోట్ల రూపాయల కోసం 70 ఏండ్లుగా సృష్టించిన ఆస్తులను తెగనమ్మడం సరికాదని అన్నారు. ఉదాహరణకు రూ 1.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను రూ 1.5 లక్షల కోట్లకు ఆర్ధిక మంత్రి విక్రయిస్తే దానిపై వచ్చే రాబడి ఎంతని ప్రశ్నించారు. రూ 20,000 కోట్ల అదనపు రాబడి కోసం ఏండ్ల తరబడి సమీకరించిన ఆస్తులను అమ్ముతారా అని చిదంబరం నిలదీశారు.
ఇది భారీ కుంభకోణం, పట్టపగలు చేసే దోపిడీ కాక మరేంటని ప్రశ్నించారు. ఎన్ఎంపీ చుట్టూ వెల్లువెత్తిన విమర్శలపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు సంజీవ్ సన్యాల్ స్పందించారు. ప్రభుత్వం వద్ద భారీగా ఆస్తులున్నాయని, వాటిని ప్రభుత్వం సొమ్ము చేసుకుని వనరులను సమీకరిస్తే వాటిని నూతన మౌలిక ప్రాజెక్టులపై ఖర్చు చేయడం, అణగారిన వర్గాల సంక్షేమానికి వెచ్చించేందుకు వెసులుబాటు ఉంటుందని అన్నారు