న్యూఢిల్లీ: విదేశీ నిధులపై ఆధారపడే ఎన్జీవోలకు కేంద్రం జలక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా ఎన్జీవోలు ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కోల్పోయాయి. వాటిల్లో ఆక్స్ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిలియా ఇస్లామియాతో పాటు అనేక స్వచ్ఛంధ సంస్థలు ఉన్నాయి. ఇటీవల మదర్ థెరిస్సా ఛారిటీతో పాటు పలు ఎన్జీవోల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం పునరుద్దరించని విషయం తెలిసిందే. అయితే విదేశీ నిధుల లైసెన్సు పునరుద్దరణ కోసం శుక్రవారం వరకే గడువు తేదీ కాగా.. దరఖాస్తు చేసుకోని ఎన్జీవోలకు లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్రహోంశాఖ చెప్పింది. దరఖాస్తు చేసుకోని వారికి ఎలా పర్మిషన్ ఇస్తారని ఓ అధికారి తెలిపారు. ఫారిన్ ఫండింగ్ లైసెన్సు కోల్పోయిన ఎన్జీవోల లిస్టులో ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లు ఉన్నాయి.
దేశంలో ఎఫ్సీఆర్ఏ లైసెన్సు కలిగి ఉన్న ఎన్జీవోల్లో 16,829 ఉన్నాయి. ఎఫ్సీఆర్ఏ కింద దేశంలో మొత్తం 22,762 ఎన్జీవోలు రిజిస్టరై ఉన్నాయి. అయితే విదేశీ నిధులు అందుకోవాలంటే, ఆ ఎన్జీవోలు కచ్చితంగా ఎఫ్సీఆర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ కోసం తాము చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించినట్లు మదర్ థెరిస్సా ఛారిటీ తెలిపింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు విదేశీ నిధులను స్వీకరించరాదు అని వివిధ యూనిట్లకు ఛారిటీ ఆదేశాలు ఇచ్చింది.