మంగళూరు, డిసెంబర్ 1: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు జాలర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చేపల నిల్వ, రవాణాలో కీలకమైన ఐస్ ఉత్పత్తికి కరెంటు కోతల వల్ల ఆటంకం ఏర్పడటంతో మత్స్యకారులు తక్కువ రేటుకు చేపలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి జిల్లాల్లో కరెంటు కోతల ప్రభావం వల్ల ఐస్ ఫ్యాక్టరీలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ‘ఆగస్టు నుంచి కరెంటు సంక్షోభం కొనసాగడం వల్ల ఐస్ ఫ్యాక్టరీలు కేవలం 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి’ అని కరావళి మీనుగరర క్రియా సమితి సభ్యుడు హరీష్ సాలియన్ అన్నారు. కరెంటు సంక్షోభం వల్ల ఒమేగా-3 ఆయిల్ ఎక్కువగా ఉండే సాైర్డెన్ చేపలను భారీ స్థాయిలో ఐస్లో నిల్వ చేసి విలువ జోడింపు ప్రాసెసింగ్ యూనిట్లకు జాలర్లు తరలించలేకపోతున్నారు. రూ.160-180 ధర పలికే ఈ చేపలను రూ.100-120లకు ఫిష్ మీల్ పరిశ్రమలకు అమ్ముకుంటున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు చేపలను తరలించేటప్పడు ఐస్ లేని పరిస్థితుల్లో జాలర్లు గత్యంతరం లేక వాటిని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లించే ధర కంటే 60 శాతం తక్కువ ధరకు స్థానికంగా అమ్ముకోవాల్సి వస్తున్నది.
కరెంటు కోతల వల్ల తీర ప్రాంతంలో 165 ఐస్ ఫ్యాక్టరీలపై ప్రభావం పడింది. రోజుకు 2,200 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ఫ్యాక్టరీలు ప్రస్తుతం రోజుకు 1900 టన్నుల ఐస్ను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. ఐస్ కొరత ప్రాసెసింగ్ యూనిట్లపైనా ప్రభావం చూపిస్తున్నది. డీజిల్ జనరేటర్లతో యూనిట్లను నడిపితే తక్కువ లాభాలు వస్తున్నాయని దక్షిణ కన్నడ ఐస్ ప్లాంట్స్ సహకార సంఘం డైరెక్టర్ మోహన్ బెంగ్రే తెలిపారు. చిన్న జాలర్ల బృందాలు, సహకార సంఘాలు జనరేటర్ల ద్వారా తమ ఫ్యాక్టరీలను నడిపించే స్థితిలో లేరని జాలర్ల నాయకులు తెలిపారు. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో ఏటా 80 వేల టన్నుల చేపలను పడతారు. వాటిలో 30 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తారు. కానీ ఐస్ తగినంత లభించక ఎగుమతులకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.