గౌహతి: కుక్కల జనాభాను నియంత్రించాలంటే వాటిని అస్సాంకు పంపాలని మహారాష్ట్ర ఎమ్మెల్యే (Maharashtra MLA) వ్యాఖ్యానించారు. దీంతో ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అస్సాం అసెంబ్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కుక్క మాంసం తినే అలవాటు ఉందని మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చు కడు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల జనాభాను నియంత్రించేందుకు వాటిని అస్సాంకు పంపాలని మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు. అయితే మహారాష్ట్ర ఎమ్మెల్యే కడు చేసిన ఈ వ్యాఖ్యలపై అస్సాం అసెంబ్లీలో శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో తన ప్రసంగాన్ని కుదించుకున్న ఆయన 15 నిమిషాల్లో దానిని ముగించారు.
కాగా, అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎమ్మెల్యే కడు చేసిన వ్యాఖ్యలను తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కమలాఖ్య డే లేవనెత్తారు. ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ నేత పవన్ ఖేరాను అరెస్టు చేయడానికి రాష్ట్ర పోలీస్ బృందం ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సంగతిని గుర్తు చేశారు. అయితే అస్సాం ప్రజలను కించపరిచేలా మాట్లాడిన మహారాష్ట్ర ఎమ్మెల్యే కడుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే రఫీకుల్ ఇస్లాం కూడా ఈ అంశంపై గట్టిగా నిలదీశారు. ప్రత్యేక హక్కు ఉల్లంఘనను సుమోటోగా తీసుకుని విచారణ జరుపాలని స్పీకర్ బిస్వజిత్ డైమరీని కోరారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేను అస్సాం అసెంబ్లీకి రప్పించి ఆయనతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.
స్వతంత్ర ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్, సీపీఎం ఎమ్మెల్యే మనోరంజన్ కూడా అసెంబ్లీలో గళమెత్తారు. మహారాష్ట్ర ఎమ్మెల్యే కడుపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారు తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ వారించారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలగేరింది. చివరకు విపక్ష ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.