న్యూఢిల్లీ: దేశ రాజధానిపై పెత్తనం చెలాయిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు (Delhi Lt Governor) సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో నామినేటెడ్ సభ్యులను నియమించేందుకు ఆయనకు ఎలాంటి అధికారం ఉందని కోర్టు ప్రశ్నించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలిచింది. ఢిల్లీ మేయర్ ఫిఠాన్ని 15 ఏళ్లుగా ఏలుతున్న బీజేపీని గద్దె దించింది. ఎంసీడీలో 250 మంది ఎన్నికైన సభ్యులతోపాటు పది మంది నామినేటెడ్ సభ్యులుంటారు.
అయితే ఆప్ అభ్యర్థి మేయర్ కాకుండా అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఎల్జీ సక్సేనా 12 మంది నామినేటెడ్ సభ్యులను నియమించారు. మేయర్ ఎన్నికలో వారికి ఓటు హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పలు వాయిదాల తర్వాత మేయర్ ఎన్నిక జరుగడంతో ఆప్ అభ్యర్థి ఎన్నికయ్యారు. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా12 మంది నామినేటెడ్ సభ్యులను ఏకపక్షంగా నియమించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం సూచనతో కాకుండా నేరుగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్కు ఆల్డర్మెన్లను నామినేట్ చేసేందుకు ఎల్జీకి ఉన్న అధికారాన్ని ప్రశ్నించింది.
కాగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎల్జీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఆల్డర్మెన్లను నామినేట్ చేసే అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు ఇవ్వడం అంటే, ఎన్నుకున్న పౌర సంస్థను అస్థిరపరచడమేనని వ్యాఖ్యానించింది. నామినేటెడ్ సభ్యుల నియామకం కేంద్రానికి ఎందుకంత ఆందోళన కలిగిస్తున్నదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎల్జీకి ఉన్న అధికారంపై ఆరా తీసింది.
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం సూచన మేరకు ఆల్డర్మెన్లను ఎల్జీ నామినేట్ చేస్తారని, గత 30 ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతున్నదని ప్రభుత్వం తరుఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ చేసిన వాదనలను ఆయన ఖండించారు. దీంతో ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.