న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సెక్యూర్టీ డిపాజిట్(Security Deposit) కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంత మంది అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోయారో తెలుసా ? ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం.. 1951 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 71 వేల మంది అభ్యర్థులు సెక్యూర్టీ డిపాజిట్ కోల్పోయారట. గెలిచిన అభ్యర్థిలో ఆరో వంత ఓట్లు పడితేనే ఓడిన అభ్యర్థికి డిపాజిట్ వాపస్ ఇస్తారు. కానీ ఒకవేళ ఆరో వంత ఓట్లు పోలవ్వకుంటే, ఆ అభ్యర్థి నామినేషన్ వేళ కట్టిన సొమ్ము పోయినట్లే లెక్క.
2019 ఎన్నికల్లో సుమారు 85 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రాకుంటే అప్పుడు ఆ డిపాజిట్ అమౌంట్ను ప్రభుత్వ ట్రెజరీకి మళ్లిస్తారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తొలి లోక్సభ ఎన్నికల నుంచి 91,160 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. దాంట్లో 71,246 మంది తమ సెక్యూర్టీ డిపాజిట్ను కోల్పోయారు. ఆ సంఖ్య 78 శాతం ఉన్నట్లు ఈసీ డేటా ద్వారా తెలుస్తోంది.
1951లో జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 సెక్యూర్టీ డిపాజిట్ ఉండేది. ప్రస్తుతం ఆ అమౌంట్ను పెంచేశారు. తాజాగా జనరల్ అభ్యర్థులపై 25 వేలు, ఎస్సీ-ఎస్టీలకు రూ.12,500 సెక్యూర్టీ డిపాజిట్ వసూల్ చేస్తున్నారు. ఆరో వంతు ఓట్లు రాని అభ్యర్థులు డిపాజిట్.. ట్రెజరీకి వెళ్తుంది.
2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు అత్యధికంగా డిపాజిట్లు కోల్పోయారు. 383 మంది అభ్యర్థుల్లో 345 మందికి డిపాజిట్ దక్కలేదు. ఆ తర్వాత జాబితాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ పార్టీ తరపు 421 మంది పోటీ చేయగా, దాంట్లో 148 మందికి డిపాజిట్ రాలేదు. 1951-52 లోక్సభ ఎన్నికల్లో 40 శాతం మంది డిపాజిట్ కోల్పోయారు. 1874 మంది అభ్యర్థిలు పోటీపడితే దాంట్లో 745 మందికి డిపాజిట్ దక్కలేదు. అయితే ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఈ ట్రెండ్ పెరిగింది. ప్రతిసారీ డిపాజిట్ దక్కని అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో 13952 మంది అభ్యర్థులు పోటీపడగా, దాంట్లో 12,688 మందికి డిపాజిట్ రాలేదు.
లోక్సభ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, జాతీయ పార్టీలకు చెందిన నేతలు తమ డిపాజిట్ను ఎక్కువ శాతం దక్కించుకోగలిగారని ఏడీఆర్ ట్రస్టీ సభ్యుడు జగదీప్ చోకర్ తెలిపారు. సెక్యూర్టీ డిపాజిట్ను కోల్పోయేందుకు కూడా సభ్యులు వెనుకాడడం లేదని ఆయన అన్నారు.