న్యూఢిల్లీ: పార్లమెంట్లో కరోనా కలకలం రేగింది. 400 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. ఈ నెల 4 నుంచి 8 వరకు మొత్తం 1,409 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 402 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 200 మంది లోక్సభ, 69 మంది రాజ్యసభ సిబ్బంది కాగా మరో 133 మంది సహాయక సిబ్బంది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారితో కలిసి ఉన్న పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన పలువురు అధికారులతోపాటు సిబ్బందిని ఐసొలేషన్లో ఉంచారు.
పార్లమెంట్ సిబ్బందికి సోకిన వేరియంట్ను గుర్తించేందుకు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అంతర్గత సూచనలు జారీ అయ్యాయని చెప్పారు. అయితే, పార్లమెంట్ ప్రాంగణంలో కరోనా సోకిన సిబ్బందిని లెక్కలోకి తీసుకోలేదు. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు వందల సంఖ్యలో సిబ్బంది కరోనా బారినపడటం కలకలం రేపుతున్నది.
మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేయాలని, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలంటూ డీడీఎంఏ ఇటీవల ఉత్తర్వలు జారీ చేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, బయోమెట్రిక్ హాజరు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది.