న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రధానంగా రైల్వే స్టేషన్లను ముట్టడించి పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పలు రైల్వే స్టేషన్లను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం 300కుపైగా రైళ్లు రద్దయ్యాయి. 94 మెయిల్-ఎక్స్ప్రెస్ రైళ్లు, 140 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే తెలిపింది. అలాగే 65 మెయిల్- ఎక్స్ప్రెస్ రైళ్లు, 30 ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. 11 మెయిల్-ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. అగ్నిపథ్పై నిరసనల నేపథ్యంలో సుమారు 340 రైళ్లు ప్రభావితమయ్యాయని రైల్వే పేర్కొంది.
కాగా, బీహార్లోని ఆరాహ్ రైల్వే స్టేషన్పై దాడి చేసిన నిరసనకారులు టికెట్ కార్యాలయంలోని రూ.3 లక్షల నగదును లూఠీ చేశారు. ప్రయాణికులకు టికెట్లు ఇస్తుండగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వచ్చిన నిరసనకారులు రాళ్ల దాడికి దిగారని, టికెట్ కార్యాలయానికి నిప్పుపెట్టి ధ్వంసం చేయడంతోపాటు రూ.3 లక్షల నగదును లూఠీ చేశారని రైల్వే అధికారి తెలిపారు.
మరోవైపు, నిరసనకారులు రైలు బోగీలకు నిప్పుపెట్టడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. హింసాత్మక నిరసనలకు పాల్పడవద్దని, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. రైల్వేలు దేశ ఆస్తి అని అన్నారు.
#WATCH | I appeal to the youth to not indulge in violent protests and not damage the property of the Railways. Railways are the property of the country: Union Railways Minister Ashwini Vaishnaw on #AgnipathProtests pic.twitter.com/TIDMlF2PeI
— ANI (@ANI) June 17, 2022