పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల (Opposition parties) పెద్ద సమావేశం జూన్ 12న జరుగనున్నది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఈ మెగా సమావేశానికి 18కి పైగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. అయితే దేశంలోని 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో జూన్ 12న పాట్నాలో సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే ఇది సన్నాహక సమావేశం మాత్రమే అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక నేత తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ప్రధాన సమావేశం ఆ తర్వాత జరుగుతుందని చెప్పారు.
కాగా, 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు పార్టీల అధినేతలను ఆయన కలుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో ఇటీవల ఢిల్లీలో సమావేశమయ్యారు. అలాగే కాంగ్రెస్ను వ్యతిరేకించే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఒక తాటిపైకి తెచ్చేందుకు వారితో మంతనాలు జరిపారు.