న్యూఢిల్లీ, జూలై 25: దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. 2021 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 12 వేలకు పైగా, నవోదయ స్కూళ్లలో 3 వేలకు పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్లో వెల్లడించింది. కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 9 వేల మందికి పైగా టీచర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12,044 టీచింగ్ పోస్టులు, 1,332 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. వీటిలో తమిళనాడులో 1,162, మధ్యప్రదేశ్లో 1,066, కర్ణాటకలో 1,066 అధ్యాపక పోస్టులు భర్తీకి నోచుకోలేదు. మరోవైపు నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,156 పోస్టుల్లో జార్ఖండ్లో అత్యధికంగా 230 ఉన్నాయని మంత్రి చెప్పారు. బదిలీలు, పదవీ విరమణల కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. భర్తీ ప్రక్రియ నిరంతం ప్రక్రియ అని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
భారీగా రిజర్వ్డ్ పోస్టులు ఖాళీ..
కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల్లో రిజర్వ్డు పోస్టులు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఓబీసీ క్యాటగిరీలో 457, ఎస్సీ-337, ఎస్టీ-168, ఈడబ్ల్యూఎస్-163, ఉన్నాయి. నవోదయ విద్యాలయాల విషయానికి వస్తే ఓబీసీ-676, ఎస్సీ-470, ఎస్టీ-234, ఈడబ్ల్యూఎస్-194 రిజర్వ్డు పోస్టులు ఇంకా ఖాళీగానే మిలిగిపోయాయి.