Bengal violence : వక్ఫ్ (సవరణ) చట్టం (Waqf Act) కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని ముర్షిదాబాద్లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారాయి. శనివారం మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ హింసకు కారణమైన 110 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉందని, హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యాప్తిచేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఘర్షణల్లో గాయపడిన 10 మంది పోలీసులు.. ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసిందని, అయితే పశ్చిమబెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. మైనారిటీలు, వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశం కలిసి ఉండేవని, తర్వాత విభజన జరిగిందని అన్నారు. ఇక్కడే ఉండిపోయిన మైనారిటీలకు రక్షణ కల్పించడం మన బాధ్యతని, తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను రక్షిస్తానని చెప్పారు.
కాగా, తాజాగా చోటుచేసుకున్న నిరసనలపై బెంగాల్లోని ప్రతిపక్ష బీజేపీ స్పందించింది. పరిస్థితిని అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించింది. దీన్ని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని, సమాజంలోని ఇతర వర్గాల్లో గందరగోళాన్ని వ్యాప్తిచేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నమని మండిపడింది.