న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మెరుపువేగంతో వ్యాప్తిచెందుతుండటంతో భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రెండు వారాల వ్యవధిలో రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని 120 జిల్లాల్లో 10 శాతానికిపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 120 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ 24 నాటి గణాంకాల ప్రకారం రెండు జిల్లాల్లో మాత్రమే ప్రతి వంద మందిలో పది మందికి పాజిటివ్ వచ్చింది. జనవరి 6 నాటికి ఈ సంఖ్య 17 రాష్ట్రాల్లోని 41 జిల్లాలకు పెరిగింది. ప్రస్తుతం 120 జిల్లాల్లో 10 శాతానికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
కాగా, దేశంలో మంగళవారం 1,68,063 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,58,75,790కి పెరిగాయి. ఇందులో 8,21,446 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,84,213 మంది మరణించారు. అదేవిధంగా ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 4461కి చెరాయి. ఇందులో 1711 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారు.