భోపాల్: పురిటి నొప్పులతో బాధపడిన ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రి బయటే ప్రసవించింది (Woman Delivers Baby). వైద్యులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దుస్థితి నెలకొన్నది. అరుణ్ పరిహార్ భార్య వాలాబాయి నిండు గర్భిణీ. ఆదివారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ కోసం అరుణ్ ఫోన్ చేశాడు. అయితే చాలా ఆలస్యంగా అది వచ్చింది. శివపురిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే అంబులెన్స్ ఆసుపత్రికి చేరిన తర్వాత ఆ మహిళను ఎవరూ పట్టించుకోలేదు. వైద్యులు, నర్సులు కూడా తమకు పట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆసుపత్రి బయటే ఆమె ప్రసవించింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
కాగా, ఈ విషయం తెలియడంతో ఆసుపత్రి వద్ద ఉన్న వ్యక్తులు ఆ మహిళ చుట్టూ గుమిగూడారు. కొందరు మహిళలు ఆమెకు సహాయం చేశారు. ఇది తెలుసుకున్న తర్వాత వైద్యులు, నర్సులు స్పందించారు. స్ట్రెచ్చర్ తెప్పించి ఆ మహిళను, నవజాత శిశువును ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అరుణ్ తెలిపాడు.
మరోవైపు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో కుక్కలు తిరుగడం, రోగుల బెడ్లపై అవి పడుకోవడం వంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.