జైపూర్: కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాంగ్రెస్ నేత కుమార్తె కిడ్నాప్ అయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించారు. దీంతో ఆ కాంగ్రెస్ నాయకుడు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. జైపూర్కు చెందిన కాంగ్రెస్ నేత, రాజస్థాన్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, సంచార, పాక్షిక సంచార గిరిజనుల సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ గోపాల్ కేసావత్ కుమార్తె, 22 ఏళ్ల అభిలాష సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కూరగాయలు కొనేందుకు సాయంత్రం 5.30 గంటలకు తన స్కూటీపై ఎన్ఆర్ఐ సర్కిల్ ప్రాంతానికి ఆమె వెళ్లింది.
అయితే సాయంత్రం 6.05 గంటలకు తన తండ్రికి అభిలాష ఫోన్ చేసింది. కొంత మంది యువకులు తనను ఫాలో అవుతున్నారని, త్వరగా రావాలంటూ భయపడుతూ చెప్పింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. దీంతో ఆందోళన చెందిన గోపాల్ కేసావత్ తన కుమార్తె కోసం అంతటా వెతికారు. ఆమె కనిపించకపోవడంతో రాత్రి వేళ ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కుమార్తె కిడ్నాప్పై ఫిర్యాదు చేశారు.
కాగా, కాంగ్రెస్ నేత గోపాల్ కేసావత్ మంగళవారం జైపూర్ పోలీస్ కమిషనరేట్కు వెళ్లారు. తన కుమార్తె కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలిపారు. త్వరగా ఆమెను వెతికి కిడ్నాపర్ల చెర నుంచి రక్షించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోపాల్ కేసావత్తోపాటు ఆయన వెంట ఉన్న కుటుంబ సభ్యులు ఏడ్చారు. తమ కుమార్తె ఆచూకీని తర్వగా గుర్తించాలని ఏసీపీకి మొరపెట్టుకున్నారు.
మరోవైపు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు అభిలాషను వెతికేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఎయిర్పోర్ట్ రోడ్డులో ఆమె ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.