Jharkhand market : ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్లోని, గిరిదిహ్ జిల్లా, ఇసారి బజార్, మార్కెట్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. దీనిపైస డీసీపీ రామ్నివాస్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్కెట్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఒక ట్రక్కు వేగంగా, అదుపుతప్పి దూసుకొచ్చింది. అక్కడే ఉన్న వాహనాలపైకి, పాదచారులపైకి దూసుకెళ్లింది. రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువ వాహనాలున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఘటనలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. వేగంగా వచ్చిన ట్రక్కు.. ఆ వాహనాల్ని ఢీకొని ఆగిపోయింది.ఈ ఘటనలో నలుగురు మరణించారు.
20 మందికిపైగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ట్రక్కును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.