హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఖర్చయినా త్వరగా గమ్యస్థానాలను చేరుస్తుంది.. ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది అని చాలామంది ఖర్చుకు వెనుకాడకుండా విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ఇటీవల ‘నేనెక్కే విమానం రోజుల తరబడి లేట్’ అన్నట్టు నరకానికి నకలుగా ప్రయాణం మారింది. దీనికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే అయినప్పటికీ, కొన్ని విమాన సంస్థల నిర్ల క్ష్యం కూడా తక్కువేమీ కాదు. ‘ప్రయాణికులే మా దేవుళ్లు’ అన్నది నినాదంగా మాత్రమే మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.
విమాన సిబ్బందితో వాగ్వాదం
పొగమంచు, ఇతర కారణాలతో విమానాలు ఆలస్యం అవుతుండటంతో గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తున్నది. విమానం ఎప్పుడు వస్తుందో, పోతుందో కూడా సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో ప్రయాణికులు సహనాన్ని కోల్పోతున్నారు. కిక్కిరిసిన విమానాశ్రయాలలో గంటల తరబడి పడిగాపులు కాయడం, సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన సంస్థలు నిబంధలను పట్టించుకోవడం లేదని, ప్రయాణం అన్ని గంటలు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించాలని, కానీ దీనిని ఏ ఎయిర్లైన్స్ పాటించడం లేదని, ఇదేమని అడిగిన తనతో ఇండిగో మేనేజర్ నేత్ర దురుసుగా ప్రవర్తించారని ప్రజ్ఞ అనే ప్రయాణికురాలు వీడియో విడుదల చేసింది.
ఆలస్యానికి మారుపేరుగా ఇండిగో
విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల కాలంలో తరచూ విమానాల రద్దు, ఆలస్యం తో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నది. దీనికి తోడు ఈ సంస్థలో సిబ్బంది లే మి, పైలట్ల కొరత వంటి కారణాలతో తరచూ ఇండిగో విమానాలు జీవితకాలం లేటు అన్న ట్టు తయారవుతున్నాయని ఒక ప్రయాణికుడు ఆరోపించాడు. ఆదివారం ఇం డిగో ైఫ్టెట్ 6ఈ2175లో పైలట్పై ప్రయాణికుడు దాడి చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
76 విమానాలు రద్దు.. 600 ఆలస్యం
ఉత్తర భారత ప్రాంతంలో ఆవరించిన విపరీతమైన మంచు కారణంగా ఈ సీజన్లోనే అత్యధికంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 76 విమానాలు రద్దు కాగా, 600 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీని ప్రభావం దేశంలోని మిగతా విమానాశ్రయాలపై కూడా పడటంతో అక్కడ కూడా ప్రయాణికులకు గంటల తరబడి ఎదురుచూపులు తప్పలేదు. అమృతసర్, పఠాన్కోట్, జమ్ము, ఛండీగఢ్, లక్నో, అలహాబాద్, వారణాసి, పాట్నా, హైదరాబాద్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఆదివారం చెన్నై ఎయిర్పోర్టులో కూడా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. మంచుకు తోడు రాష్ట్రంలో భోగి మంటల కారణంగా ఏర్పడిన పొగ వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పారు. జనవరిలో సగటున 21.6 రోజులు ఢిల్లీ ఎయిర్పోర్టులో పొగమంచు ప్రభావం చూపినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇబ్బందుల తొలగింపునకు ఆరు సూత్రాల ప్రణాళిక
ఇటీవల విమాన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో చోటు చేసుకునే సంఘటనలను రోజూ కేంద్రానికి నివేదించాలి. పొగమంచు, ఇతర కారణాల జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ఆరు సూత్రాల ప్రణాళికతో మార్గదర్శకాలను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల ఇబ్బందులు తొలగించడానికి పాటించాల్సిన మార్గదర్శకాలను ఎయిర్లైన్స్కు జారీ చేశారు.
3 గంటలు మించితే రద్దు చేయవచ్చు
3 గంటల మించి ఆలస్యం అవుతాయనుకున్న సర్వీసులను విమానయాన సంస్థలు తగినంత ముందుగానే రద్దు చేయవచ్చునని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం ప్రకటించింది. విమానయాన సంస్థలన్నీ విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలపాలి. విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్థమయ్యేలా వివరించాలి.
విమానం ఆలస్యంతో నేలపైనే భోజనం
పొగమంచు కారణంగా గంటలకొద్దీ ఆలస్యం జరిగి ముంబై విమానాశ్రయంలో ల్యాండైన ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన పౌర విమానయాన శాఖ విమానయాన సంస్థ ఇండిగోకు నోటీసులను జారీ చేస్తూ మంగళవారం సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా విమాన కార్యకలాపాలు కొనసాగించారని, ఈ విషయంలో ఇండిగో, ముంబై విమానాశ్రయం తగు రీతిలో వ్యవహరించ లేదని తన నోటీసులో పేర్కొంది. పొగమంచు కారణంగా గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్లో దిగింది. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ప్రయాణికులు కిందకు దిగి విమానం పక్కనే నేలపై కూర్చుని భోజనం చేశారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో కేంద్రం తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది.