హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అదానీ అక్రమాలపై జేపీసీ వేసి నిజాలను నిగ్గుతేల్చండి.. లేదంటే దిగిపోండి అని నినదిస్తూ బీఆర్ఎస్ సహా విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. అదానీ-హిండెన్బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని గానీ లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్ సహా విపక్ష పార్టీలన్నీ గొంతుకలిపాయి. ఈ బడ్టెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతున్న విషయం తెలిసిందే.
దేశ ప్రతిష్టకు భంగం కలిగించి, ప్రపంచ దేశాల్లో భారత్కు తలవంపులు తెచ్చే అంశాన్ని అత్యంత ప్రధానమైందిగా పరిగణించి తక్షణమే చర్చించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేస్తున్నది. అందులో భాగంగా గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎంపీలు అదానీ వ్యవహారంపై తేల్చాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఉభయ సభల్లో సభ్యుల నినాదాలు, ఆందోళనలు పెరగటంతో గందరగోళ వాతావరణం నెలకొన్నది. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం విపక్షాల ఎంపీలు పార్లమెంటు ఒకటో నంబర్ గేట్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి పార్లమెంట్ ప్రాంగణంలోని అంబేదర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకొని ధర్నా నిర్వహించారు. జేపీసీ కోసం ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సభ్యులు తెరపైకి తెచ్చి ఆందోళన చేశారు.
ప్రజాస్వామ్యానికి కేంద్రం వెన్నుపోటు: కేకే
అదానీ వ్యవహారంపై చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం పారిపోయిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. అదానీ అంశంపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇస్తున్నా చర్చకు ప్రభుత్వం ముందుకు రావటం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి కేంద్రం వెన్నుపోటు పొడుస్తున్నదని మండిపడ్డారు. సభ ఆర్డర్లో లేదని వాయిదా తీర్మానాలు పరిగణనలోకి తీసుకోకుండా చర్చ జరగనివ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటున్నదని విమర్శించారు. అదానీ ప్రధాని మోదీ స్నేహితుడు కాబట్టే పార్లమెంట్లో ప్రభుత్వం చర్చ జరగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి సంబంధించి అనేక అంశాలు చర్చకు రావాల్సి ఉందని, అందుకే చర్చ కోరుతున్నామని చెప్పారు.
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: నామా
అదానీ అక్రమాలపై తేల్చేందుకు కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి జేపీసీ కోసం పట్టుబడుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. మోదీ దిగొచ్చి అదానీ అంశంపై జేపీసీ వేసి, ఉభయ సభల్లో చర్చకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.
అదానీని అరెస్టు చేయాలి
ఆర్థికమంత్రి , ఈడీ, సీబీఐ ఆఫీసుల వద్ద టీఎంసీ నిరసన
ఆర్థిక అక్రమాలకు పాల్పడిన గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లారు. ఇదే డిమాండ్తో ఆ పార్టీ ఎంపీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కార్యాలయాలకు కూడా ర్యాలీగా వెళ్లారు. తమ నిరసనను తెలియజేస్తూ.. ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ ఫొటోలు ముద్రించిన రెండు టోపీలపై సంతకాలు చేసి కార్యాలయాల్లో పెట్టి వచ్చారు. సామాన్య ప్రజలకు చెందిన రూ.1.20 లక్షల కోట్ల సొమ్ముకు సంబంధించి అదానీ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.