ప్రతిపక్షాల ఐక్యతే ప్రధాని మోదీని గద్దె దింపుతుందని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. 2024 ఎన్నికల్లో ఓ అనూహ్య పరిణామం జరుగుతుందని జోస్యం చెప్పారు. ”పట్టుమని పది ఎంపీ సీట్లైనా సాధించని ఎన్సీపీ, పవార్ను ప్రధాని పీఠంపై కూర్చోబెడుతుందట” అని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు నవాబ్ మాలిక్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు. 2024 లో పవార్ ప్రధాని అవుతారని ఎన్సీపీ ఎక్కడా చెప్పలేదని, పవార్ కూడా ఎక్కడా చెప్పలేదని నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. అయితే ప్రతిపక్షాలన్నింటినీ పవార్ ఏకం చేస్తారని, మోదీ ప్రభుత్వాన్ని కూలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. 2024 లో మాత్రం ఓ అనూహ్య పరిణామం జరగడం మాత్రం ఖాయమని మంత్రి నవాబ్ మాలిక్ నొక్కి వక్కానించారు.
పవార్ను ప్రధాని పీఠంపై కూర్చోబెడతాం
2024 నాటికి పవార్ను ప్రధాని పీఠంపై కూర్చోబెడతామని ఎన్సీపీ కానీ, అటు పవార్ గానీ ఎక్కడా చెప్పలేదు. అయితే.. ఎన్సీపీ అధినేత పవార్ 81 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ అమోల్ ఖోలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ విస్తరణ కోసం విపరీతంగా కష్టపడి, ఏదో ఒకనాడు ప్రధాని పీఠంపై అధ్యక్షుడు శరద్ పవార్ని కూర్చోబెడదామని కార్యకర్తలతో అన్నారు. రద్ పవార్కు ప్రస్తుతం 81 సంవత్సరాలున్నాయని, అయినా నిత్యం ఏదో రకంగా ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారని ఎన్సీపీ అభిప్రాయపడింది. నిత్యం కష్టపడి పనిచేసే స్వభావమున్న పవార్ను ఏదో ఒకరోజు ప్రధానిని చేసి తీరుతామని ఎన్సీపీ ఎంపీ పేర్కొన్నారు.