న్యూఢిల్లీ : రిషి సునాక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో విపక్షాలు బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. బ్రిటన్ నుంచి భారత్ వైవిధ్యాన్ని నేర్చుకోవాలని కాంగ్రెస్ మోదీ సారధ్యంలోని కాషాయ సర్కార్కు చురకలు వేసింది. వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని గుర్తుచేసింది.
గత ఎనిమిదేండ్లుగా అన్నీ మారిపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రిషి సునాక్ అత్యున్నత పదవికి ఎగబాకడం నుంచి భారత్ పాఠం నేర్చుకుంటుందని ఆశిస్తున్నామని కాంగ్రెస్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. మైనారిటీల నుంచి ఒకరిని అత్యున్నత పదవికి ఎన్నుకునే పద్ధతిని ఆచరించాలని అన్నారు. తొలుత కమలా హ్యరిస్..ప్రస్తుతం రిషీ సునాక్..అమెరికా, బ్రిటన్ ప్రజలు మెజారిటీయేతర పౌరులను ప్రభుత్వంలో అత్యున్నత స్ధానాలకు ఎన్నుకున్నారని చిదంబరం ట్వీట్ చేశారు.
భారత్తో పాటు దేశంలో ఆధిపత్య భావజాలాన్ని ఆచరించే పార్టీలకు ఇది ఓ పాఠంలా తాను భావిస్తున్నానని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా బ్రిటిషర్లు వ్యవహరిస్తూ మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తిని అత్యున్నత పదవికి ఎన్నుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రిషీ సునాక్ ఎదిగిన తీరును మనం వేడుకలా జరుపుకోవాలని అన్నారు.